అన్నదాత సుఖీభవ: రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ చేసిన సీఎం చంద్రబాబు

  • చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుట్లలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
  • 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు విడుదల
  • తొలి విడతగా ఒక్కో రైతుకు రూ.7 వేల చొప్పున ఆర్థిక సాయం
  • కడప, కర్నూలులో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన
  • వ్యవసాయ స్టాళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి
రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుట్ల వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన బటన్ నొక్కి 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లను జమ చేశారు. ఈ సాయంతో ప్రతి రైతు ఖాతాలో తొలి విడతగా రూ.7,000 జమ అయ్యాయి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి, అంతకుముందు వ్యవసాయ, ఉద్యానవన శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. రైతులు, మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ప్రాసెసింగ్ యూనిట్లు, వర్మీ కంపోస్టు తయారీ, నూనె గింజల మిషన్ వంటి ప్రదర్శనల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఎం కిసాన్ పథకంపై ప్రధాని మోదీ ప్రసంగించిన కార్యక్రమాన్ని రైతులతో కలిసి సీఎం వీక్షించారు.

ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా కడప, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్లు 2026 డిసెంబరు నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Chandrababu Naidu
Annadata Sukhibhava
PM Kisan
Andhra Pradesh Farmers
Financial Assistance
Chilakaluripet

More Telugu News